తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. జూన్ ఒకటో తేదీన గన్పార్క్లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా బీఆర్ఎస్నాయకులు నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వేడుకల సభ నిర్వహిస్తారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అదే రోజు హైదరాబాద్లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిల పంపిణీ కార్యక్రమాలు చేపడతారు.
జూన్ మూడో తేదీన అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగరవేసి కార్యక్రమాలు జరపనున్నారు. ఆయా జిల్లాల్లోని ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేస్తారు.
తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ప్రభుత్వానిదేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు.బీఆర్ఎస్ పార్టీ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు పార్టీ సూచనలు అనుసరించి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ కోరారు.