కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం దిశగా పాఠశాలలు సిద్దం అవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ప్రకటించింది. పని దినాలతో పాటుగా సెలవుల పైన స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో విద్యా శాఖ అధికారులు తాజాగా కీలక ఆదేవాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు ఒకవిధంగా పేరెంట్స్ కు ఊరటనిచ్చేవే. అదే సమయంలో ఇవి ఎంత వరకు అమలు సాధ్యమనే చర్చ మొదలైంది. ఈ మార్గదర్శకాల పైన చర్చ ప్రారంభమైంది.
తాజా ఆదేశాలు యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా అమ్ముకోవాలని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న రాష్ట్ర పాఠశాలలతోపాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలకు కూడా వర్తిస్తుంది.
అమ్మకాల పై ఆంక్షలు ఈ పాఠశాలల ప్రాంగణాల్లో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని విక్రయించకూడదు. కోర్టు ఆదేశాల ప్రకారం.. పాఠశాల కౌంటర్లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే అవి లాభాపేక్ష లేకుండా ఉండాలని అధికారులు స్పష్టం చేసారు. ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని అమ్మకుండా చూసుకోవాలన్నారు.
ఉత్తర్వులు జారీ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్ డీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి వార్షిక అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు మార్చి 31 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో (మే 31)తో సెలవులు ముగియనున్నాయి. దీంతో శనివారం (జూన్ 1) నుంచి జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.