లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ ఫలితాల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజారిటీ ఇవ్వకపోయినా.. ప్రధాని నరేంద్ర మోడీకి ఇది రాజకీయంగా, నైతికంగా పరాజయమని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల విజయమన్నారు.
ప్రజలు నరేంద్ర మోడీ, అమిత్ షాలను తిరస్కరించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే. యుద్ధం చేశామని, తమ పోరాటాన్ని ప్రజలు స్వాగతించారని రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికలకు ముందు అన్ని వ్యవస్థలు తమకు వ్యతిరేకంగానే పనిచేశాయని గుర్తు చేశారు. అయినా సరే కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని కొనియాడారు.
ఇండియా కూటమి తదుపరి కార్యచరణపై బుధవారం సమావేశం కానున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజలు కలసికట్టుగా పోరాటం చేస్తారని తాను అనుకున్నానన్న రాహుల్… ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో చేశారు. కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు,కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని అభినందించారు రాహుల్.
పాత మిత్రులైన పీడీపీ, జేడీయూతో సంప్రదింపులు జరుపుతారా?.. ప్రతిపక్షంలోనే ఉంటారా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. “బుధవారం మా ఇండియా కూటమి నేతలతో సమావేశం ఉంటుంది. వారితో సంప్రదింపులు చేయకుండా ఎలాంటి ప్రకటనలు చేయం” అని రాహుల్ స్పష్టంచేశారు. అలాగే కేరళలోని వయనాడ్తో పాటు యూపీలోని రాయ్బరేలీ రెండు సీట్లలో సాధించిన విజయం గురించి స్పందించారు. “నేను రెండు స్థానాల్లో ఉండటం కుదరదు. దానిపై ఆలోచిస్తున్నాను. ఏ సీటు వదులుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ రాహుల్ తెలిపారు.
అంతకుముందు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని, ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు దేశంలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు ప్రజల ఫలితాలు. ఇది ప్రజల విజయం. ఇది ప్రజాస్వామ్య విజయం. ఈ పోరు మోడీ వర్సెస్ ప్రజలని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఈసారి ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కానీ, ప్రజలకు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని ఆదేశం వచ్చింది. ఇది ఆయన (మోడీ)కి రాజకీయ, నైతిక పరాజయం అని మల్లిఖార్జున వ్యాఖ్యానించారు.