ఏపీ నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన రోజునే నీరభ్ కుమార్ ప్రసాద్ ముగ్గురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. ఏపీ సీఎంఓలో పనిచేసిన ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. ముగ్గురూ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు అనూహ్య విజయం సాధించడంతో.. అధికారుల బదిలీలు సాధారణమయ్యాయి. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారిని ఒక్కొక్కరుగా బదిలీ చేస్తున్నారు ఉన్నతాధికారులు. సీఎస్ జవహర్ రెడ్డి నిన్నటి నుంచి సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరులోపు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో శుక్రవారం నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.కొత్త సీఎస్ బదిలీతో సెలవుపై ఉన్న జవహర్ రెడ్డిని బదిలీ చేశారు.
సీఎస్ నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన సెక్రటరీగా పనిచేస్తున్నారు. కాగా.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడానికి ముందు చంద్రబాబునాయుడిని కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన కోసం రెండు గంటల సమయం వేచిచూడగా.. రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా పంపించేశారు చంద్రబాబు నాయుడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంకెంతమంది ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలు జరుగుతాయో చూడాలి.