కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సోనియాతో సమావేశం ముగిసిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా సోనియా గాంధీని కోరినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీని అవతరణ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలిపారు.
రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు జూన్ 2న సోనియా విచ్చేస్తారని, ఆమె పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పుకున్న సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనే సోనియాగాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతం జయ జయహే ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
అలాగే.. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో ఉద్యమకారులందరికీ సమాన గౌరవం దక్కుతుందని, ప్రజా తెలంగాణలో జరుగుతున్న మొట్టమొదటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలని తెలిపారు.