తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై భారీగా సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర గీతంతోపాటుగా అధికారిక చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, చిహ్నంకు సంబంధించి సూచనలు రావడంతో ఆవిష్కరణను ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా గీతాన్ని మాత్రమే విడుదల చేయనున్నది.
ఇదిలా ఉండగా, అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి.. ప్రముఖులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారిక చిహ్నం ఖరారైందని, ఇదే ఫైనల్ లోగో అంటూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.