తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత కారణంగా జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటి పూట బయటకు రావాల్సి వస్తే.. వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సింగరేణి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెలపాడు, మంచిర్యాల జిల్లా నస్పూర్లో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా కేతెపల్లి, ఖమ్మం జిల్లా ఖానాపూర్ హవేలీలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరికొన్ని జిల్లాల్లోనూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా బుట్టాపూర్లో 46, ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 45.7, కొమురం భీం జిల్లా కుంచవెల్లి లో 45.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలతో 20 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల ద్విచక్ర వాహన మెకానిక్ అన్వేష్కు సంబంధించిన ఇంటి ఆవరణలో ఎండ వేడితో దాదాపుగా 20 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ద్విచక్ర వాహనాలతో పాటు ఇంటిలోని సామాగ్రి మంటల్లో కాలిపోయింది. సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
వడదెబ్బతో ఇద్దరు మృతి
తెలంగాణ రాష్ట్రంలో ఎండతీవ్రత, వడగాలులను తట్టుకోలేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో కళ్యాణం రామక్క అనే వృద్ధురాలు వడదెబ్బ తగలడంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు, చొప్పదండిలో వడదెబ్బతో ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి జిల్లా కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ లోడ్తో చొప్పదండికి వచ్చిన లారీ డ్రైవర్ జాకీర్ హుస్సేన్(60) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు 108కు ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ వచ్చేలోపే హుస్సేన్ మృతి చెందాడు.