లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్స్పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం స్పందించారు. ఎన్నికల ఫలితాలు ఎగ్టిట్ పోల్స్కు పూర్తి విరుద్ధంగా ఉంటాయన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని చెప్పాయి.
ఈ నేపథ్యంలో వీటిపై మీడియా ప్రతినిధులు సోనియాను ప్రశ్నించగా.. ‘జస్ట్ వెయిట్ అండ్ సీ.. రానున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్పోల్స్కు పూర్తి విరుద్ధంగా ఉంటాయని ఆశాభావంతో ఉన్నాం’ అని సోనియా గాంధీ జవాబిచ్చారు. అంతకుముందు, ఎగ్జిట్పోల్స్ను మోడీ మీడియా పోల్స్ అంటూ కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసిన విషంయ తెలిసిందే.
ఇక ఇండియా కూటమి 295 సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న (మంగళవారం) వెలువడనుండగా.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ వాటి కోసం సోమవారం వేచి చూడాలని అన్నారు. సోమవారం ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో సోనియా, రాహుల్ గాంధీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదివారం నాటి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందని అంచనా వేసింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏ 361-401 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని, ఇండియా కూటమి 131-166 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.
ఇక, రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్ 543 సీట్లలో ఎన్డీఏకి 359, ఇండియా కూటమికి 154 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మరోవైపు, న్యూస్ఎక్స్ డైనమిక్స్ ఎన్డిఏకి 371 సీట్లు, ఇండియా కూటమికి 125 సీట్లు ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ను సైకలాజికల్ గేమ్గా అభివర్ణించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్.. జూన్ 4న ఎగ్జిట్ పోల్స్, ఫలితాల్లో భారీ వ్యత్యాసం ఉండనుందని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ మీడియా సృష్టి అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఎన్నికల్లో ఇండియా కూటమి 295 మార్కును దాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.