ఏపీలో ఈ నెల 13 ఎన్నికలు జరగ్గా.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలు గా ఉన్న టీడీపీ, జనసేన , బీజేపీలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల కళ్లన్నీకూడా ఎగ్జిట్ పోల్స్పై పడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కడతాయో అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తుది దశ పోలింగ్ ముగియగానే అంటే శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక పందెం రాయుళ్లకు ఈ ఎన్నికలు పండగలా మారాయి. ఐపీఎల్ ముగియడంతో ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అని భారీ ఎత్తున బెట్టింగ్ రాయుళ్లు పందెలు కాస్తున్నారు. ఒక్క ఏపీలోనే 2000 వేల కోట్ల వరకు పందెలు జరిగినట్టు సమాచారం.
తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదిరిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పందెం వేశారు. మరొకరేమో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఏకంగా రూ.10 లక్షలు పందెం వేయడం విశేషం. అయితే వైసీపీకి చెందిన నేత ఒకరు కదిరిలో టీడీపీ గెలుస్తుందని పందెం వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వైసీపీ నేత పేరు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.